Telangana BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భాగంగా చిన్న చిన్న పార్టీల విలీనంపైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పాటు తాజాగా హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం ఆ పార్టీకి బుస్టప్ ఇచ్చింది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ముందుకు వెళుతుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న సంకేతాలను ఇస్తుంది. మరో పక్క కేసిఆర్ వ్యతిరేక శక్తులను, అసంతృప్తి వాదులను పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఉద్యమ నాయకులు స్వామిగౌడ్, దిలీప్, రవీంద్ర నాయక్, ఈటల రాజేందర్ లాంటి సీనియర్ లు బీజేపీలో చేరిపోగా, త్వరలో విఠల్ కూడా కాషాయదళంలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
Telangana BJP: ఈ పార్టీల విలీనంపై దృష్టి
బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు చిన్న చిన్న పార్టీలపైనా బీజేపీ దృష్టి సారించింది. యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే పావులు కదుపుతోంది. ఈ క్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమ తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే జిట్టా బాలకృష్ణకు భువనగిరి పార్లమెంట్ లేదా అసెంబ్లీ సీటు, రాణి రుద్రమకు వరంగల్ జిల్లాలో ఒక స్థానం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసిందనీ, మరో సారి ఫైనల్ చర్చలు జరిపిన తర్వాత విలీనం ఉంటుందని భావిస్తున్నారు. యువ తెలంగాణతో పాటు మరో పార్టీని కూడా విలీనం చేసుకునేందుకు కమలదళం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నేత సారధ్యం వహిస్తున్న పార్టీ తోనూ చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. మరో ఏడాదిన్నరలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండి పావులు కదుపుతోంది బీజేపి. ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ఉదృతం చేసేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.