తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. బహిరంగ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మద్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేటి ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరు అవుతారా లేదా అన్నది మధ్యాహ్నం వరకూ ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసిఆర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు అవుతున్నారనీ, సాయంత్రం 6.30 గంటలకు ప్రగతి భవన్ నుండి రాజ్ భవన్ కు బయలు దేరనున్నారంటూ సీఎంఓ నుండి సమాచారం పంపింది. కానీ సీఎం కేసిఆర్ రాజ్ భవన్ కు వెళ్లలేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా కార్యక్రమానికి హజరు కాలేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, హైదరాబాద్, రాచకొండ సీపీలు సీపీ ఆనంద్, మహేష్ భగవత్ లు, పలువురు ప్రముఖులు మాత్రమే హజరైయ్యారు. అతిధులకు గవర్నర్ తమిళి సై స్వాగతం పలికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్, సీఎం కేసిఆర్ లు చివరిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా కరోనా కారణంగా ఎట్ హోమ్ తేనీటి విందు కార్యక్రమానికి హజరు కాలేలకపోతున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేయగా, పాదయాత్ర లో ఉన్నందున రాలేకపోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కరోనా వేవ్ కారణంగా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పలు పర్యాయాలు సీఎం కేసిఆర్ రాజ్ భవన్ పట్ల వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తమిళి సై బాహాటంగానే విమర్శలు చేశారు. ఆ సమయాల్లో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. దీంతో రాజ్ భవన్ లో కార్యక్రమాలకు సీఎం కేసిఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.