తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూ ఉంది. మరో సారి బీజేపీ, ప్రధాన మంత్రి మోడీ విధానాలపై నిప్పులు చెరిగారు సీఎం కేసిఆర్. ఆదివారం మీడియా మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని జలగల్లా పట్టి పీడిస్తొందని విమర్శించారు. ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. హైదరాబాద్ సభలో కేసిఆర్ ను తిట్టడానికే కేంద్ర మంత్రులు పరిమితమయ్యారని అన్నారు. మోడీ దేశానికి ఏదో చేస్తారు అని అనుకుంటే ఏమీ లేదని విమర్శించారు. మోడీ అసమర్ధ పాలన సాగిస్తున్నారని, బీజేపీ తెలంగాణకే కాదు, దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. దేశ ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టోయిందని పేర్కొన్నారు కేసిఆర్.
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని విమర్శించారనీ, ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోందో ప్రధాని మోడీ చెప్పాలన్నారు. నాడు మోడీ అడిగిన ప్రశ్ననే ఇప్పుడు మేమూ అడుగుతున్నామన్నారు. బీజేపీ అసమర్ధ పాలన వల్లనే దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ డాలర్ తో రూ.80లకు పడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో మినహా దేశంలో అంతా తప్పుడు విద్యుత్ పాలసీని తీసుకువచ్చారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతలు, మంచి నీటి కొరత ఉందన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం పది శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా అని ప్రశ్నించారు కేసిఆర్. అనవసరంగా లొల్లి చేయడం ఒక్కటే బీజేపీకి నేతలకు చేతనయ్యేది అని మండిపడ్డారు కేసిఆర్.
బీజేపీ చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలు చూశారనీ, అందుకే కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెబుతున్నామన్నారు. తప్పకుండా మారుస్తామని చెప్పారు. వాళ్లు మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అంటుంటారనీ, ఆ విషయంలో వారికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తెలంగాణలో సర్కార్ 100 హెచ్ పీ హార్స్ పవర్ తో ఫుల్ స్పీడ్ గా నడుస్తొందనీ, కేంద్రంలోనూ తెలంగాణ లాంటి ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పని చేస్తే జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
రీసెంట్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ టీఆర్ఎస్ లో కట్టప్పలు చాలా మంది ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కేసిఆర్. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిపోయిందన్నారు. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లు ఉన్న చోట ఏక్ నాథ్ శిందే వంటి వాళ్లు వస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో మూడవ వంతు మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇక కట్టప్పలా… కాకరకాయలా.. కట్టప్పలు, ఏక్ నాథ్ శిందే వంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది అని ప్రశ్నించారు. బీజేపీ అసమర్ధ విధానాల వల్ల దేశం పరువు పోతోందని విమర్శించారు. నుపూర్ శర్మ విషయంలో సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖ దాటిందని విశ్రాంత న్యాయమూర్తులతో లేఖ రాయించడం ఏమిటని మండిపడ్డారు కేసిఆర్. బీజేపీ నేతలు సుప్రీం కోర్టును కూడా ఖాతరు చేయడం లేదనీ, సీఎంలను, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తమతో పెట్టుకుంటే అగ్గితో గొక్కున్నట్టేనని కేసిఆర్ హెచ్చరిస్తూ నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటా అని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోడీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ కేసిఆర్ .. శ్రీలంకలో ఒక ప్రాజెక్టును ఆయన స్నేహితుడికి ఇచ్చారనీ, అది కూడా భారత ప్రభుత్వం నామినేట్ చేసిందన్నారు. ప్రధాని మోడీ ఒత్తిడితోనే ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక అధికారులు కూడా చెప్పారన్నారు. చరిత్రలో ఇలా ఏ ప్రధాని కూడా నామినేట్ చేయలేదన్నారు. మోడీపై శ్రీలంక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు కేసిఆర్. గణేశ్ విగ్రహాలు, జాతీయ జెండాలు చైనా నుండే కొనుగోలు చేస్తున్నారనీ, ఇదా మేకిన్ ఇండియా అంటే అని ప్రశ్నించారు. బీజేపీది మత పిచ్చి రాజకీయం అని దుయ్యబట్టారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టడమేనా బీజేపీ రాజకీయం అని ప్రశ్నించారు. ఒక వేళ కేంద్రం ముందస్తు ఎన్నికలకు వస్తే తాను రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తామని సవాల్ విసిరారు కేసిఆర్.
టీఆర్ఎస్ లో చాలా మంది కట్టప్పలు ఉన్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు