టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. ఇవేళ బీజేపీ నాయకత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టారు. రెండు రోజుల క్రితమే మంత్రి కేటిఆర్ .. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంకు సంబంధించి పాన్ ఇండియా మువీ లాంటి పూర్తి వీడియోలు త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున ఈ విషయంలో ఎక్కువ మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు గంటల్లో కేసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. తన ప్రభుత్వాన్ని కూలగొడటాతమని చెబుతుంటే ఊరుకుని మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడా చేద్దామని అనుకున్నారనీ, కానీ ఇది చైతన్య గడ్డ తెలంగాణ కాబట్టి మా ఎమ్మెల్యేలు వీరోచితంగా దీన్ని బయటపెట్టారని అన్నారు.
మొయినా బాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై ముగ్గురు నిందితులు మాట్లాడిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదలు కొని అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపుతామని తెలిపారు. ఈ వ్యవహారం దేశం మొత్తం చూడాలన్నారు. వాళ్ల సంభాషణల్లో బీజేపీ పెద్దల పేర్లు చెప్పారన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల ముసుగులో పెద్ద ముఠాా పని చేస్తొందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వేల కోట్ల రూపాయలు వీళ్లకు ఎక్కడినుండి వస్తున్నాయో తెలియాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే పశ్చిమ బెంగాల్ లో మీటింగ్ మాట్లాడుతూ 40 మంది మమతా బెనర్జీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించాని ఇది ఏమి సంస్కృతి అని ప్రశ్నించారు. అమిత్ షా ఇక్కడకు వచ్చి తెలంగాణ సర్కార్ కూలిపోతుందని చెబుతారు మరీ ఇంత దారుణమా అని అన్నారు. బీజేపీ జుగుప్సాకర రాజకీయాలు చేస్తొందని దుయ్యబట్టారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా వ్యవహరించారు. ఇంకా ఏయే రాష్ట్రాల్లోో ప్లాన్ చేయబోతున్నారు అనేది ఆ వీడియోల్లో పూర్తిగా ఉందని కేసిఆర్ తెలిపారు.
దేశంలోని అన్ని రంగాలను బీజేపీ సర్వనాశనం చేసిందని కేసిఆర్ విమర్శించారు. ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని కేసిఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి తాను మీడియా ముందుకు రాలేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ దారుణంగా వ్యవహరించారన్నారు. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్లుగా తప్పుడు వార్తలను సృష్టించారన్నారు. ఇండియా ఆకలి రాజ్యంగా మార బోతుందన్నారు. మునుగోడు పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజలకు తెలియజేద్దామనే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. చాలా బాధతో తాను మాట్లాడుతున్నానని కేసిఆర్ వివరాలను వెల్లడించారు.