జాతీయ సమైక్యత దినోత్సవంగా భావించే సెప్టెంబర్ 17ను కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తూ వక్రీకరిస్తున్నారని సీఎం కేసిఆర్ మండిపడ్డారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలో సీఎం కేసిఆర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సమాజం రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య స్వేచ్చ వైపునకు పయనించిన రోజు ఇది అని అన్నారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా ఏకమైయ్యారనీ, ఎందరో త్యాగధనుల ఫలితమే తెలంగాణ సమాజానికి స్వేచ్చ లభించిందని కేసిఆర్ అన్నారు. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య సాహసాలను మర్చిపోలేమన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని కల్గించారని అన్నారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అనేక కష్టాలు పడ్డామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తమను బానిసలుగా చూస్తున్నారన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొందని అన్నారు. పద్నాలుగేళ్లు తాను ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన ఉద్యమాన్ని గుర్తు చేశారు కేసిఆర్. అన్ని పార్టీలను మెప్పించి, ఒప్పించి తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఎనిమిదేళ్ల తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని చెప్పారు. ఐటీ రంగం లో ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రగతి పథంలో నడుస్తుంటే మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేషపు మంటలు రగిలించడం సమర్ధనీయం కాదని కేసిఆర్ అన్నారు. కొన్ని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించాలని కుట్రలు చేస్తున్నాయనీ, వాటి నుండి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు అదమరిస్తే విచ్చిన్నకర శక్తుల నుండి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. తెలంగాణ నేలపై నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగనీయవద్దని సూచించారు. మతోన్మాద శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందామని కేసిఆర్ పిలుపు నిచ్చారు.
విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేకపోయారన్న కేంద్ర మంత్రి అమిత్ షా