Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బుధవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. సిఎం కెసిఆర్ గంట సేపు కరోనా రోగులు ఉన్న వార్డులలో కలియ తిరిగి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దనీ, భయపడవద్దనీ మెరుగైన వైద్యం అందించి బీమార్ తగ్గించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులతో సహా పలు జనరల్ వార్డులలో సిఎం కెసిఆర్ కలియ తిరిగారు. రోగులతో వారి పేరు, వివరాలు అడిగి తెలుసుకుని మరీ ప్రత్యేకంగా మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. రోగులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే అధికారులకు చెప్పి పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.
అసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కెసిఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ను తయారు చేసే ఈ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో నెలకొల్పారు. ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సిఎం కెసిఆర్ స్వయంగా మాట్లాడి వారు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద ఉన్నదని సిఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, సిఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, సిఎంవో అధికారి గంగాధర్, డిఎంఈ రమేశ్ రెడ్డి, గాంధీ సూపరిండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసిఆర్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆయన పిపిఈ కిట్ ధరించకుండా కేవలం మాస్కు మాత్రమే ధరించి గాంధీ ఆసుపత్రిలో కలియతిరుగుతూ కోవిడ్ రోగులను పరామర్శించడం తీవ్ర సంచలనం అయ్యింది. ముఖ్యమంత్రి హోదాలోని నేత కోవిడ్ రోగులను నేరుగా కలుసుకుని పరామర్శించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.