తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మర్రి శశిధర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపి పార్టీ చేరతారు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదనీ, తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత పనులపై తరచుగా ఢిల్లీకి వస్తునే ఉంటానని, అయితే ఈ సారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వార్తలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని పేర్కొన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గంగా ఉండటం, మర్రి శశిధర్ రెడ్డి ప్రయాణించిన విమానంలో బీజేపీ నేతలు, డీకే అరుణ వంటి వారు ఉండటంతో ఈ ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేకుల గానీ లేక బీజేపీ వాళ్లు గానీ ఈ ప్రచారాన్ని చేసి ఉంటారని భావిస్తున్నారు.