Telangana Congress: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం తెలంగాణ పీసీసీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా క్యాడర్ కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం పలు ప్రాంతీయ పార్టీల్లో కార్యకర్తల కోసం అమలు అవుతున్న ఇన్సూరెన్స్ స్కీమ్ ను తొలి సారిగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ శాఖ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల డిజిటల్ సభ్యత్వాలు లక్ష్యంగా నిర్దేశించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..ఇప్పటి వరకూ 7 లక్షల సభ్యత్వాలు పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. రెండు లక్షల భీమా సదుపాయం కల్పిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల భీమా కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. సభ్యత్వాల నమోదులో నిర్దేశించుకున్న లక్ష్యం ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తి కాకుంటే మరి కొన్ని రోజులు గడువు కావాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు తెలిపారు.
Telangana Congress: పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు
చాలా పారదర్శకంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి ఒక ధీమా కల్పిస్తున్నామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నామని ఆయన తెలిపారు. కార్యకర్తలు తాము కాంగ్రెస్ సభ్యులము అని చాలా గర్వంగా చెప్పుకునేలా చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సభ్యులకు భీమా సౌకర్యం కల్పించడం ఇదే ప్రధమమని చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను గత నెల 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైందని చెప్పిన రేవంత్ రెడ్డి.. వచ్చే ఏడాది మార్చి 31వరకూ ఈ సభ్యత్వం ఉంటుందని తెలిపారు.