గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రైలు మార్గంద్వారా బయలుదేరిన గవర్నర్ తమిళిసై ఆదివారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడి నుండి మణుగూరు మీదుగా భద్రాచలం బయలుదేరారు. వరద బాధితులను పరామర్శిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. స్వయంగా బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు తమిళి సై వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెడ్ క్రాస్, ఇతర స్వచ్చంద సంస్థలు ఇచ్చిన సామాగ్రిని వరద బాధితులకు తమిళి సై తన పర్యటనలో పంపిణీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. వాస్తవానికి ఈ రోజు గవర్నర్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
మరో పక్క సీఎం కేసిఆర్ ఈ రోజు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న రాత్రి హన్మకొండ కు చేరుకున్న కేసిఆర్ అక్కడ వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని అనుకున్నా వాతావరణం సహకరించకపోవడంతో ఆయన రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరు నాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ బారీ వర్షంలోనే సీఎం కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం, వరదలు సృష్టించిన భీభత్సాన్ని సీఎం పరిశీలిస్తున్నారు.
కాగా అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. వరద బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. అశ్వాపురం రహదారిపై వరద బాధితులు బైటాయించారు. మరో పక్క కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో సీఎం కేసిఆర్ పర్యటనను పురస్కరించుకుని పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్, వామపక్షాల నేతలను హౌస్ అరెస్టు చేశారు. సీఎం కేసిఆర్ భద్రాచలం కు చేరుకుని బ్రిడ్జి పై నుండి గోదావరికి పూజలు నిర్వహించారు. గోదావరి ప్రవాహాన్ని బ్రిడ్జి పై నుండి కేసిఆర్ పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టటంతో కొంత ఊరట కల్గించిందని, 70 అడుగులు దాటిన గోదావరి వరద పరిస్థితిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భారీ వరద కారణంగా భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. తన పర్యటనలో భాగంగా వరద బాధితులతో సీఎం కేసిఆర్ మాట్లాడనున్నారు. భారీ వరదల సమయంలో భద్రాచలం పట్టణం నీట మునగకుండా కరకట్ట ఎత్తును మరింత పెంచాలని స్థానికులు సీఎం కేసిఆర్ ను కోరుతున్నారు. గోదావరి నదిలో ప్రతిఏటా ఉధృతంగా వస్తున్న వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించడానికి అవసరమైన శాశ్వత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారుల సమీక్షలో పేర్కొన్నారు.