రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించడం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా (ప్రభుత్వ పాఠం చదవడం) ప్రసంగించడంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మద్య గతం నుండి నెలకొన్న విభేదాలు సమసిపోతున్నట్లేనని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ప్రగతి భవన్ – రాజ్ భవన్ మళ్లీ వివాదం ముదురుతున్నట్లే కనబడుతోంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. బడ్జెట్ సమావేశాల సమయంలో కోర్టుకు వెళ్లి వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్ .. ఈ సారి ఏకంగా సుప్రీం కోర్టు గడప తొక్కింది. బిల్లులు గవర్నర్ ఆమోదించడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడంపై సుప్రీం కోర్టులో రిటి పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది రాష్ట్ర ప్రభుత్వం.
పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవీ
- తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
- ములుగు అటవీ కళాశాలను యూనివర్శిటీగా మార్చే బిల్లు
- ప్రైవేటు యూనివర్శిటీస్ బిల్లు
- మోటర్ వాహనాల పన్ను బిల్లు
- వ్యవసాయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లు
- మున్సిపల్ చట్ట సవరణ
- పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు
తనపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళి సై ట్వట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి తీరుపై అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు గవర్నర్ తమిళి సై. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర ఉందని అన్నారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్ భవన్ కు రాలేదని పేర్కొన్నారు. కనీస మర్యాదగా ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా అని ప్రశ్నించారు. మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గర అని సీఎస్ శాంతి కుమారి గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం కనీస మర్యాద, గౌరవం ఇవ్వడం లేదన్నట్లుగా మరో సారి గవర్నర్ తమిళి సై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఎంత వరకూ దారి తీస్తాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. సుప్రీం కోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. తొలి రోజు కార్యక్రమాలు ఇలా..