Telangana Govt: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో వేగవంతంగా జరగడం లేదు. అయితే నిత్యం ప్రజలతో సంబంధాలు నిర్వహిస్తూ విధులు నిర్వహించే ఉద్యోగులు మాత్రం వ్యాక్సిన్ లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బ్యాంకుల్లో లావాదేవీల నిర్వహణకు నిత్యం వేల సంఖ్యలో వచ్చి వెళుతుంటారు. బ్యాంకుల్లో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగులు కరోనాపై భయం భయంతోనే విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ బ్యాంకు ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Govt: వారం రోజుల్లో వ్యాక్సినేషన్
రాష్ట్రంలో వివిధ బ్యాంకుల్లో పని చేసే అధికారులు, సిబ్బందికి వేగవంతంగా టీకాలు వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్విహించనున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ బీఆర్కే భవనంలో సీఎస్ సోమేశ్ కుమార్ వివిధ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చర్చించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే బ్యాంకు సిబ్బందికి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులు సీఎస్ కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపడతామని తెలిపారు. వారం రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యాధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. బ్యాంకు సిబ్బంది కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తుండటం పల్ల వివిధ బ్యాంకుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.