Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా (corona) సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో నామమాత్రంగా కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాల్లో వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహామ్మారి ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టేసింది. గత ఏడాది కరోనా మొదటి దశలో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో కొద్ది నెలలకు తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది మొదట్లో మళ్లీ కరోనా సెకండ్ వేర్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ వేవ్ లో గ్రామీణ ప్రాంతాలకు కరోనా మహామ్మారి విస్తరించింది.
Corona Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్
ఈ ఏడాది సెకండ్ వేవ్ లో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ తరుణంలోనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో ప్రజానీకంగా కొంత ఊరట చెందారు. తొలుత వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది, పోలీస్ ఇతర ఉద్యోగులకు ఆ తరువాత 60 సంవత్సరాల పైబడినవారికి, తదుపరి 40 ఏళ్లు, తరువాత 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతూనే ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు పలువురు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రజలకు ఉన్న అనుమానాలపై వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొంత మంది వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
వ్యాక్సినే తీసుకోకపోతే రేషన్, పింఛన్ కట్
కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే నవంబర్ 1వ తేదీ నుండి వారికి రేషన్, పెన్షన్ పంపిణీ నిలుపుదల చేయాలని నిర్ణయించింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కరోనా టీకా తీసుకోని వారికి రేషన్, ఫించన్ నిలిపివేస్తామని డిహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకుని మహమ్మారి నుండి అప్రమత్తంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.