ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ విచారణపై మద్యంతర ఉత్తర్వులు (స్టే) ఇవ్వాలని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు. అయితే ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ వల్ల ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
ఎమ్మెల్యేల కొినుగోలు కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదు దారుడనీ, అయినప్పటికీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతృ, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వాలని విచారణ పేరుతో వేధిస్తున్నారని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ విచారణను నిలుపుదల చేయాలని కోరారు. పార్టీ మారితే వంద కోట్లు ఆఫర్ చేశారు గానీ డబ్బులు ఇవ్వనప్పుడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో మనీలాండరింగ్ విచారణ చట్ట విరుద్దమని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం, ఈడీలకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
అయితే రోహిత్ రెడ్డికి ఇప్పటికే ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కోర్టు కేసును 5వ తేదీకి వాయిదా వేయడంతో కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకూ రోహిత్ రెడ్డి విచారణకు హజరు కావాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈడీ రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారణ జరిపింది. మరో పక్క ఈ కేసులో రెండవ నిందితుడుగా ఉన్న నందకుమార్ ను కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారణ జరిపిన ఈడీ అధికారులు.. నందకుమార్ నుండి సేకరించిన వ్యాంగ్మూలాన్ని సీల్డ్ కవర్ లో నాంపల్లి కోర్టుకు అందజేసింది.