వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గతంలో విధించిన షరతులను పాటించాలని కోర్టు సూచించింది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసిఆర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగతంగా విమర్శించవద్దని హైకోర్టు సూచించింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్లు సీపీకి హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల వరంగల్లు జిల్లాలో షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఆ సందర్భంగా జరిగిన దాడిలో షర్మిల వాహనం ధ్వంసం అయ్యింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిల పాదయాత్ర అనుమతులు రద్దు చేసి అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా మార్గమధ్యలోనే అరెస్టు చేశారు. షర్మిల కారు దిగకపోవడంతో ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. అనంతరం పలు సెక్షన్ల కింద అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా మెజిస్ట్రేట్ అమె రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు.
కాగా తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వరంగల్లు పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆమరణ దీక్ష చేశారు. ఆమె ఆరోగ్యం క్షిణించడంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం షర్మిల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు మరో సారి తన పాదయాత్రపై షర్మిల హైకోర్టును ఆశ్రయించిగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.