కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్లాన్ ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లుగా ప్రభుత్వం వివరించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అవసరమైతే ముందుగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ విషయంలో కోర్టుకు తెలియకుండా ముందుకు వెళ్లవద్దని సూచించింది. అదే విధంగా సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ లో ఇంప్లీడ్ పర్సన్ గా డివిజన్ బెంచ్ ముందు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తరపున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు.
అసలు వివాదం ఏమిటంటే.. కామిరెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రూపొందించిది. అయితే తమ పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా గుర్తించారని రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ భూమి విలువ పడిపోతుందనే ఆవేదనతో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య కు పాల్పడటంతో రైతుల ఉద్యమం తీవ్రతరం అయ్యింది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రైతులు చేస్తున్నఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతల భూముల విలువ పెంచేందుకు మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో మున్సిపాలిటీ అత్యవసర సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను ఉప సంహరించుకున్నట్లుగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గత విచారణ సమయంలో రైతుల తరపు న్యాయవాదులు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు వివరించారు., అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం మాస్టర్ ప్లాన్ అంశంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వం తెలియజేయాలని హైకోర్టు పేర్కొంది. నేటి విచారణ సమయంలో ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్లుగా ప్రభుత్వం తెలియజేయగా, ధర్మాసనం.. ఆ అంశంలో కోర్టుకు తెలియజేయకుండా ముందుకు వెళ్లవద్దంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీలో కేసిఆర్ మాటల వెనుక వ్యూహం అదేనని పేర్కొన్న ఈటల రాజేందర్