TRS MLA poaching case: తెలంగాణ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇవేళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ధర్మాసనం ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై వాదనలు జరుపుతున్న సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పోలీసులు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవేళ జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పై ఉన్న స్టే ను హైకోర్టు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైకోర్టు తాజా తీర్పుతో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ తరుణంలో నిందితుల కస్టడీయల్ విచారణకు కోరే అవకాశం ఉంది. ఇక సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్ పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం .. తదిపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట