Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ విచారణ ను ఎదుర్కొంటున్నారు. అయితే కస్టడీ లో సీబీఐ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను పాటించడం లేదంటూ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కస్టడీ విచారణలో సుప్రీం కోర్టు, హైకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.
విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిందేనని హైకోర్టు అదేశించింది. అలాగే పిటిషన్ల న్యాయవాదిని రెండు గంటల వరకూ అనుమతించాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. సాయంత్రం 5 గంటల వరకూ అంటే విచారణ పూర్తి అయ్యే వరకూ న్యాయవాదిన అనుమతించాలని తెలిపింది. అయితే ప్రశ్నలు లిఖిత పూర్వకంగా అడిగేలా సీబీఐని ఆదేశించాలని భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టును కోరగా .. దర్యాప్తు ఎలా చేయాలో సీబీఐకి తాము చెప్పలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సీబీఐ అధికారులు నిన్నటి నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి లను విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి విచారణ కు గానీ సీబీఐ కార్యాలయానికి వెళుతుండగా, సీబీఐ కోర్టు కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చంచల్ గూడ జైలు నుండి సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకూ సీబీఐ అధికారులు నిందితులను విచారించనున్నారు.