టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసు జారీ చేసినా విచారణకు హజరు కాలేదని సిట్ తరపున ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉండటం వల్ల సంతోష్ హజరు కాలేకపోయారని, విచారణకు హజరుకాకపోవడానికి గల కారణం వివరిస్తూ సంతోష్ సిట్ కు లేఖ కూడా రాశారని బీజేపీ తరపు న్యాయవాది వివరించారు. సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీని వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని ఉదయం పేర్కొన్న హైకోర్టు.. విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం అయిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీని హైకోర్టుకు అందజేశారు. దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని ఏజి కోర్టుకు తెలిపారు.
నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకూ బీఎల్ సంతోష్ సహకరించడం లేదని, 41 ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం బీఎల్ సంతోష్ కు మరో సారి నోటీసులు ఇవ్వాలని సిట్ కు హైకోర్టు ఆదేశించింది. 41 ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయవద్దని ఆర్డర్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం తరుపున అడిషనల్ ఏజీ హైకోర్టును కోరారు. అయితే హైకోర్టు ఆ అభ్యర్ధనను నిరాకరించింది.
బీఎల్ సంతోష్ కు గతంలో జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులో విచారణకు హజరుకాకపోతే అరెస్టు చేస్తామని సీట్ పేర్కొంది. ఈ నోటీసుపై బీజేపీ గతంలో హైకోర్టు ను ఆశ్రయించగా, తదుపరి అదేశాలు జారీ చేసే వరకూ అరెస్టు చేయవద్దంటూ సీట్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేయవద్దన్న ఆర్డన్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించడంతో బీఎల్ సంతోష్ కు స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది. అయిత కోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణను మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది.