Telangana High court : వివాదాస్పద హఫీజ్పేట భూములపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైదరాబాద్ హఫీజ్ పేట సర్వే నెంబర్ 80లోని 140 ఎకరాల భూములు ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డువి కావని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవేనని తేల్చి చెప్పింది.
ఆ భూములు తమవేనంటూ మాజీ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతో పాటు మరి కొందరు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల రెండవ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆ భూముల్లో 50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహా యజమానుల పేర నమోదు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు రూ.4లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది.
ఈ భూముల వివాదం నేపథ్యంలోనే ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేశారంటూ ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తదితరులపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా బెయిల్ పై విడుదల అయ్యారు.