తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నుండి కేంద్రానికి రూ.3,68 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.1,68 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. రెండు లక్షల కోట్లు ఇంకా తెలంగాణకే బాకీ ఉన్నారని చెప్పారు. కానీ సిగ్గులేని కేంద్ర మంత్రి, ఇక్కడ ఉండే నలుగురు సన్నాసి ఎంపీలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అవగాహన లేదు. కనీసం ఇంగితం లేదు, కేసిఆర్ పై పనికి మాలిన వాగుడు వాగుతుంటారని కేటిఆర్ మండిపడ్డారు.
తెల్లవారి లేస్తే పనికి మాలిన బూతులు మాట్లాడటం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప వాళ్లకు మరో పని లేదని అన్నారు కేటిఆర్. తెలంగాణ చెల్లించిన లక్ష కోట్ల రూపాయల పన్నులు బీజేపీ పాలిత వెనుకబడిన రాష్ట్రాల్లో వాడుతున్నది నిజం కాదా అనేది ఇక్కడ ఉండే బీజేపీ నేతలు, కేంద్రంలోని పెద్దలు చెప్పాలన్నారు. తాను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనాామా చేస్తానని సవాల్ విసిరారు. తాను చెప్పింది తప్పు అని నిరూపించలేకపోతే కిషన్ రెడ్డి రాజీనామా చేయడం అటుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పగలరా.. ఆ సంస్కారం ఉందా అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. తన సవాల్ తో కిషన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తారని తాను అనుకోవడం లేదనీ, ఆ పని ఆయనకు చేతకాదని అన్నారు కేటిఆర్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్దుడు, దద్దమ్మ కిషన్ రెడ్డి అని విమర్శించారు.
కేసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఇంకో బీజేపీ సన్నాసి మాట్లాడుతున్నారనీ, మోడీ కంటే ముందు ఉన్న 14 మంది ప్రధానులు అందరూ కలిసి రూ.56లక్షల కోట్లు అప్పు చేస్తే మోడీ ఒక్కడే ఈ ఎనిమిదేళ్లలో వంద లక్షల కోట్లు అప్పులు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో పుట్టే ప్రతి పిల్లవాడి తలపై లక్షా 25వేల రుణం మోపుతున్నరని విమర్శించారు. కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలను అమలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పు వివిధ ప్రాజెక్టు ల ద్వారా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి సంపదను పునరుత్పత్తి చేస్తుంటే వారి కళ్లు ఎందుకు మండుతున్నాయని ప్రశ్నించారు.
కేసిఆర్ నాయకత్వం లో తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్షా 24వేలు ఉండగా ఇవేళ తెలంగాణ తలసరి ఆదాయం రూ.2లక్షల 78వేలు అని పేర్కొన్నారు. ఇవి తాను చెబుతున్న లెక్కలు కాదనీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న లెక్క అని తెలిపారు. ఇక నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ తలసరి ఆదాయం లక్షా 49వేలు మాత్రమేననీ, ఇది తెలంగాణ తలసరి ఆదాయంలో సగమని అన్నారు. దీన్ని బట్టే ఎవరు సమర్ధులో, ఎవరు అసమర్ధులో అర్ధమవుతుందని కేటిఆర్ పేర్కొన్నారు.