మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డి కొందరు వ్యక్తులతో మందు పార్టీలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ మందు పార్టీలు ఇస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి మందు బాటిల్ పట్టుకుని గ్లాస్ లో పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో రావడంతో ఆయన స్పందించారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.
“ఎన్నికల ప్రచారంలో ఉన్న తాను బంధువులు పిలిస్తే భోజనానికి వెళ్లా.. మంత్రి అయిన తర్వాత మొదటి సారిగా ఆ గ్రామంలో ఉన్న మా బంధువుల ఇంటికి మొదటి సారిగా వెళ్లా..అక్కడ ఉన్న వాళ్లు అన్న, బావ వరుస అయ్యే వాళ్లు. వాళ్లతో కలిసి భోజనానికి ముందు మందు పార్టీలో కూర్చున్నా.. అది తప్పు అవుతుందా.. రహస్యంగా ఎక్కగా కూర్చోలేదు. పబ్లిక్ ప్లేస్ లో కూర్చోలేదు. మా బంధువుల ఇంట్లో కూర్చున్నాం. అక్కడ ఉన్న అయిదుగురు ఆరుగురు మా బంధువులే.. అది తప్పెలా అవుతుంది. నిన్న ఆదివారం సరదాగా మా వాళ్లతో కంపెనీ ఇచ్చాను, ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియా పెట్టి వైరల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కే కాదు సీబీఐ కి ఫిర్యాదు చేసి ఇదేదో పెద్ద స్కామ్ అని విచారణ చేయించమనండి’ అంటూ మంత్రి మల్లారెడ్డి సైటైర్ వేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది. వాళ్లకు ఓట్లు వేసే వారే లేరు. బీజేపీకి డిపాజిట్ లు కూడా రావు అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మునుగోడులో టీాఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పిన ఆయన టీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి ట్రోలింగ్స్ కు పాల్పడుతున్నయంటూ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు