Huzurabad By Poll: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశం హాట్ హాట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయమే లక్ష్యంగా ఇరుపార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నాయి. బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఈటల రాజేందర్ తన సొంత బలాన్ని నమ్ముకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అధికార బలంతో ఈటలకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. ఇప్పటి వరకూ ఈటల బీసీ కార్డు ఉపయోగించి నియోజకవర్గంలో ఆ వర్గ ఓటర్లను గంప గుత్తగా సాధించాలని అనుకున్నారు. అయితే సీఎం కేసిఆర్ వ్యూహత్మకంగా ఈటల బీసీ ఓటింగ్ కు గండి కొట్టే విధంగా యాదవ (బీసీ) సమాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. మరో పక్క నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అధికార టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందనీ, లేకుంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దళిత ఓటు బ్యాంకు కోసం దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో కేసిఆర్ సర్కార్ ప్రారంభించింది.
టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హూజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల ఫలితంపై ఓ ఆసక్తికరమైన లెక్క చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితం అందరం చూశామనీ, ఆభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం అవుతుంతో ప్రజలు వారినే గెలిపిస్తారని సాగర్ ఫలితం నిరూపితం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నుండి బరిలో ఉన్న పిల్లోడు నోముల భరత్ గెలిచాడని గుర్తు చేశారు. తొలుత సీనియర్ నేత జానారెడ్డి ముందు పిల్లోడు భరత్ ఎలా గెలుస్తాడని చాలా మంది అనుకున్నారని అన్నారు.
అదే మాదిరిగా గతంలో హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాడు జిల్లాలో టీడీపీ ఫేమస్ నాయకుడైన మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముద్దసాని దామోదరరెడ్డి తో ఈటల రాజేందర్ తలపడి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు కూడా సీనియర్ నేత అయిన దామోదరరెడ్డి ముందు ఈటల రాజేందర్ ఆనతాడా అని అనుకున్నారనీ, కానీ టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఈటల గెలిచారని గుర్తు చేశారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పిన తలసాని ఈ రెండు ఎన్నికల మాదిరిగానే సీనియర్ లను కాదని జూనియర్ లను ఎలా గెలిపించారో ఇప్పుడు అదే మాదిరిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఘన విజయం సాధించడం ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. తలసాని లెక్క, ఊహ కరెక్టు అవుతుందో లేదో వేచి చూడాలి.