Telangana MLC Elections: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. మొత్తం 12 స్థానాలకు గానూ ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా ఆరు స్థానాలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్ రమణ, భానుప్రసాద్ విజయం సాధించారు. ఎల్ రమణకు 479 ఓట్లు, భానుప్రసాద్ కు 584 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి దండే విఠల్ గెలుపొందారు. 667 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు విజయం సాధించారు. తాతా మధుకు 480 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి కి 242, స్వతంత్ర అభ్యర్ధికి నాలుగు ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
Telangana MLC Elections: ఆరు స్థానాల్లోనూ..
నల్లగొండ లో ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డికి 917 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధులు నగేష్ కు 226 ఓట్లు, లక్ష్మయ్య కు 26, వెంకటేశ్వర్లుకు 6, రామ్ సింగ్ కు 5 ఓట్లు వచ్చాయి. 50 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మెదక్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి తూర్పు నిర్మలకు 238, స్వతంత్ర అభ్యర్ధి మల్లారెడ్డికి 6 ఓట్లు పోల్ అయ్యాయి. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఊహించిన విధంగానే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు గురి కాకుండా ముందుస్తు వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు చేయడంతో పెద్దగా క్రాస్ ఓటింగ్ జరగలేదు.