Telangana municipolls: తెలంగాణలో వరంగల్లు, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్లు, సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినప్పటికీ నేతల్లో సందిగ్దత కొనసాగుతోంది. ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రం అవుతున్న కారణంగా ప్రజలు, నేతల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు నేతలు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కరోనా భయంతో ఓటర్లు నేతలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తమ ఇంటికి నాయకులు ఎవరూ రావద్దని, ఓటు కంటే ప్రాణం ముఖ్యం అంటూ బోర్డులు కూడా తగిలించారు.
గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్ పలు వర్గాల నుండి వస్తున్నది. నేతలు, అభ్యర్థులు భయం భయంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకారమే పోలింగ్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ పేర్కొంటోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా అన్న మాట ప్రజల నుండి వినబడుతోంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా పీక్ స్టేజీకి వెళుతున్న తరుణంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీంతో నేతలు, ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారాలను ఆపాలని ఎస్ఈసీ ఆదేశించడంతో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఈ ఎన్నికలకు సంబంధించి 30వ తేదీ పోలింగ్ జరగనుండగా మే మూడవ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరో పక్క కరోనా కట్టడి చర్యలపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నది. ప్రచార పర్వం మరో నాలుగు రోజులు ఉంది. ఎస్ఈసీ షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు అంతగా ఉత్సాహం చూపే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది.