క్రిస్మస్ తర్వాత, సంక్రాంతి లోపు ఏ రోజైనా తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు . క్రిస్మస్కు ముందే పేరు ప్రకటిస్తారని కొందరు భావించినా.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పినట్లు చీఫ్ ఎంపికకు హైకమాండ్ టైమ్ తీసుకుంటోంది. పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో ఎవరైతే బెటర్ అనే ఆలోచిస్తోంది. రేసులో తొలుత చాలా మంది ఉన్నప్పటికీ తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. నిన్నమొన్నటి దాకా ముగ్గురి మధ్య రేస్ నడిచి, అది కాస్త ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీకి పరిమితమైనట్లు సమాచారం.గ్రేటర్ ఎన్నికల ఓటమి అనంతరం పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం మాణిక్కం ఠాగూర్ డిసెంబర్ 9న కసరత్తు మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు గాంధీభవన్లో కూర్చొని 160 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని అందరి నేతలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఇతర నేతల పేర్లు చెప్పగా, మరికొందరు తమకే ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. మొత్తం మీద ఈ అభిప్రాయాలన్నింటినీ తీసుకొని ఢిల్లీ వెళ్లిన మాణిక్కం హైకమాండ్కు రిపోర్టు సమర్పించారు.
ఆ ఇద్దరు ఎంపీల లోనేఒకరికి ఛాన్స్
అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత పీసీసీ కొత్త చీఫ్ఎవరనే దానిపై పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సోషల్ మీడియాలో ఫలానా వాళ్లకే పీసీసీ చీఫ్ పదవి అనే ప్రచారం సాగింది. ఇందులో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ముందుంది. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. బీసీ కోటాలో కొందరు లీడర్లు తమ పేర్లు ప్రచారం చేసుకున్నా.. అవి రూల్ అవుట్ అయిపోయాయని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రేస్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డికి మధ్య నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది.