వారం రోజుల వ్యవధిలో అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తి దుండగుల కాల్పుల కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా వరంగల్లు జిల్లా హన్మకొండకు చెందిన రాజమౌళి, పుష్పలీల దంపతుల కుమారుడు దేశిన ప్రవీణ్ కుమార్ (37), కోడలు నవత లు నాలుగేళ్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల బాలుడు ఉన్నారు.
ఈ నెల 22న తేదీన ప్రవీణ్ కుమార్ తన కార్యాలయంకు వెళ్లేందుకు ఎడిసన్ స్టేషన్ లో టైంటాన్ నుండి వస్తున్న నార్త్ ఈస్ట్ కారిడార్ రైలును ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడటంతో మృతి చెందాడు. ప్రవీణ్ తో పాటు అక్కడే ఉంటున్న ఆయన బావ మరిది ఈ విషయాన్ని ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అక్కడి స్నేహితులతో ప్రవీణ్ బావ మరిది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ మృతదేహాం న్యూజెర్సీలోని మిడిలెస్సెక్స్ రీజనల్ ఎగ్జామినర్ లో ఉంచారు. వీలైనంత త్వరగా ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప దాస్యం వినయ్ భాస్కర్ కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడించి ఏర్పాట్లు చేస్తున్నారు.