నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) లో మధ్యాహ్నం భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురి అయిన ఘటనను పురస్కరించుకుని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా మరో నలుగురు విద్యార్ధులకు వైద్యం అందిస్తున్నారు. కోమలి అనే విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయుూలో చికిత్స అందిస్తున్నారు. యూనివర్శిటీలోని పీయూసీ – 1,. పీయూసీ – 2 మెస్ లలో నిన్న మద్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్దులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు క్యాంపస్ లోనే ప్రాధమిక వైద్యం అందించారు. నిర్మల్, భైంసా వైద్యులను క్యాంపస్ కు పిలిపించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన పలువురు విద్యార్ధులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ ఘటనపై వివిధ రాజకీయ పక్షాల నేతలు, విద్యార్ధి సంఘాల స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ మండిపడుతున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ రంజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు రెండు మెస్ లపై కేసు నమోదు చేశారు. సీపీఐ నారాయణ బాసర ట్రిపుల్ ఐటీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్ధులతో మాట్లాడటానికి కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్ఘమని అన్నారు నారాయణ. బాసర ట్రిపుల్ ఐటీలోకి విద్యార్ధుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నేతలను వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రైవేటు సాామ్రాజ్యమా లేక పాకిస్థాన్ టెర్రరిస్ట్ క్యాంపా అని ప్రశ్నించారు నారాయణ.
ఈ ఘటనను పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వందలాది మంది విద్యార్ధులు చావుబతుకుల మధ్య ఉంటే ప్రభుత్వానికి ఏ పట్టింపూ లేదని విమర్శించారు. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసిఆర్ ప్రభుత్వం వర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తొందని ఆయన విమర్శించారు. విద్యాశాఖ మంత్రిని తక్షణమే భర్తరఫ్ చేసి మెస్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ విద్యార్ధులను విద్యాశాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నరని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. జేబులు నింపుకోవడంపైనే రాష్ట్ర సర్కార్ కు శ్రద్ద ఉందని, ప్రజల సంక్షేమంపై ఎలాంటి పట్టింపు లేదని దుయ్యబట్టారు.
మరో పక్క విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్లిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురు వెంకట్ ను ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలకు మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు నిరాకరించినా బల్మూరు వెంకట్ ఆసుపత్రిలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద విద్యార్ధులు ధర్నా చేశారు. బీజేవైఎం, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటి ముటట్డికి యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
బ్రేకింగ్ .. బాసర ట్రిపుల్ ఐటిలో 60 మంది విద్యార్ధులకు అస్వస్థత