తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం రేపిన చిచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారుతోంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి నాయకత్వంపై మొదటి నుండి వ్యతిరేకతతో ఉన్న సీనియర్ నేతలు పలువురు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పీసీసీ కమిటీలపై తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, ఈరోజు తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భేటీ అయి పార్టీలో పరిస్థితులపై చర్చించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి, కోదండ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేన రెడ్డి తదితరులు హజరైయ్యారు.
ఈ సందర్భంలో ఈ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని వీరు ఆరోపించారు. కాంగ్రెస్ ను కాపాడుతున్న తమపై కోవర్టులు అంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. పీసీసీ కమిటీల కూర్పులో తాను పాలు పంచుకోలేదనీ అందుకే తనను కలిసిన వారికి న్యాయ చేయలేకపోయానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ విషయంలో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మాజీ పీసీసీ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడూ పార్టీలో చూడలేదని అన్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ గెలిచే ప్రాంతాల్లో ఏకాభిప్రాయం రాలేదని, 33 జిల్లాల్లో 26 చోట్ల నియమించి ఏడు చోట్ల ఆపటం సరికాదని అన్నారు. కమిటీల్లో ఎక్కువగా బయట నుండి (వేరే పార్టీ) వచ్చిన వారికే స్థానం కల్పించారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు జరుగుతున్న అన్యాయం పై త్వరలో తామంతా అధిష్టానాన్ని కలిసి ఇక్కడి పరిస్థితులు వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు.
దామోదర రాజనర్శింహా మాట్లాడుతూ మొదటి నుండి పార్టీలో ఉన్న వారిని కాపాడుకోవాలన్నదే తమ అవేదన అని చెప్పుకొచ్చారు. తాము నాలుగు పార్టీలు మారి వచ్చిన వాళ్లం కాదని పరోక్షంగా రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి అంటూ ఇక్కడే ఉంటాం.. ఇక్కడే చస్తాం అని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. కమిటీలకు సంబంధించిన విషయాల్లో పీసీసీ అధ్యక్షుడితో సమాన స్థాయిలో ఉండే సీఎల్పీ నేతనే భాగస్వామ్యం చేయడం లేదని, ఆయనకే అన్యాయం జరుగుతోందని అన్నారు. కుట్రపూరితంగా కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుండి వచ్చిన వారికి తమను ప్రశ్నించే స్థాయి లేదని అన్నారు. అధికార పార్టీతో వ్యాపారం చేస్తూ తమకు నీతులు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలంతా సుదీర్ఘకాలంగా ఉన్న వాళ్లేనని అన్నారు. ఇలా సీనియర్ నేతలు రేవంత్ నాయకత్వంపై విరుచుకుపడటం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తొంది.
ఎయిర్ ఫిల్టర్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం .. మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో చూడండి..ఇదిగో వీడియో