Telangana TDP President: తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్శింహులు నియమితులైయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ టీడీపీ చీఫ్ గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన ఎల్ రమణ ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ నేతలతో రెండు మూడు పర్యాయాలు సమాలోచన జరిపిన అనంతరం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ బాధ్యతలను బక్కని నర్శింహులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్శింహులు గతంలో షాద్నగర్ ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడుగా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చాలా కాలంగా ఆయన పార్టీ విధేయుడుగా ఉంటూ వచ్చారు. తనపై నమ్మకంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు బక్కని నర్శింహులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బక్కని నర్శింహులు మర్యాదపూర్వకంగా కలవగా లోకేష్ ఆయనను అభినందించారు.
ఎల్ రమణ రాజీనామా చేసిన అనంతరం చంద్రబాబు టీడీపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ముఖ్యనేతలతో రెండు మూడు పర్యాయాలు చర్చలు జరిపారు. ఈ క్రమంలో అరవింద్ గౌడ్, రావుల చంద్రశేఖరరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల రావుల పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. గతంలో బీసీ సమాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు నేడు దళిత సామాజిక వర్గ నేతను పార్టీ అధ్యక్షుడుగా నియమించారు. గతంలో టీఆర్ఎస్ స్థాపించిన సమయంలో దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు కేసిఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత నేతను సీఎం చేస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని తరువాత ఎవరు అంతగా పట్టించుకోలేదు. గతంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో వామపక్ష పార్టీల పరిస్థితి కంటే దారుణంగా తయారైంది. టీడీపీ ద్వారా రాజకీయంగా ఎదిగిన ఎందరో నాయకులు టీఆర్ఎస్ చేరిపోగా కొందరు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు తీసుకున్న దళిత్ కార్డు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?