Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారి భయంతో అల్లాడుతున్న ప్రజానీకానికి తాజాగా బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కలవర పెడుతోంది. ఇటీవలి కాలం వరకూ గుజరాత్, మహారాష్ట్ర లో కేసులను గుర్తించగా తాజాగా తెలంగాణలోనూ బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం భైంసా ప్రాంతానికి చెందిన లింగురామ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. కరోనా చికిత్స అనంతరం ఈ వ్యాధి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం అధికారికంగా దీన్ని దృవీకరించలేదు.
గాంధీ ఆసుపత్రిలో మూడు కేసులు గుర్తించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా ఒకరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో మూడు కేసులు ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంటుండగా ప్రైవేటు ఆసుపత్రులలో ఎన్ని కేసులు వస్తున్నాయేది తెలియడం లేదు. ఈ కేసులు క్రమ క్రమంగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ పలు సూచనలు చేశారు.
ఇటీవల కాలంలో ఈ వ్యాధి కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామన్నారు. అయితే ఇది ఒకరి నుండి మరొకరికి సోకే వ్యాధి కాదని చెప్పారు. తొలి దశలోనే రోగ నిర్ధారణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని మంత్రి అన్నారు. ఈ వ్యాధి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు.
Black Fungus: బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏమిటంటే..
కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కోవిడ్ రోగులందరికీ ఇది రాదని అన్నారు. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరికీ బ్లాక్ ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి ఎవరికి సోకే అవకాశం ఉందంటే..
షుగర్ నియంత్రణలో లేనివారు. కిడ్నీ మార్పిడి వంటి శస్త్ర చికిత్సల్లో భాగంగా రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు. ఇతర సమస్యలు ఉన్న వారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది.