టీ కాంగ్రెస్ సీనియర్ నేతల పంచాయతీ తీర్చేందుకు అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ కమిటీల నియామకం విషయంలో మొదటి నుండి పార్టీలో పని చేస్తున్నవారికి అన్యాయం జరిగింది అంటూ 9 మంది సీనియర్ నేతలు టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి నాయకత్వంపై వారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వలస నేతలకు పదవులు ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఈ పరిణామంతో 12 మంది తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనం అయ్యింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిన్న హైదరాబాద్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమైయ్యారు. అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతలతో ఒక్కరొక్కరితో ఆయన మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ఈ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన ఓయు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కాంగ్రెస్ నేత అనిల్ పై బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఏ ఆధారాలతో ఆరోపణలుచేశావంటూ అనిల్ పై దాడికి ప్రయత్నించారు. సేవ్ కాంగ్రెస్ అని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో కార్యాలయంలో ఉన్న సీనియర్ నేతలు పలువురు బయటకు వచ్చి కార్యకర్తలను సముదాయించారు.
సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్శింహ, జగ్గారెడ్డి తదితర సీనియర్ లు ఇటీవల సమావేశం నిర్వహించారు. ఆ మరసటి రోజు పీసీసీ ఈసీ మీటింగ్ ఈ తొమ్మిది మంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అసమ్మతి నేతలకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో పరిస్థితులను చక్కదిద్దేందుకు దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ కు విచ్చేశారు.