Breaking: టెన్త్ ప్రశ్నాపత్రాల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. బండి సంజయ్ ను జైలుకు తరలించే ఏర్పాట్లు అధికారులు చేశారు. కాగా బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏ ఒ గా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ 2 గా బూర ప్రశాంత్, ఏ 3 గా మహేష్, ఏ 4 గా బాలుడు, ఏ 5 గా మోతం శివ గణ్ష్, ఏ 6 గా పోగు సుభాష్, ఏ 7 గా పోగు శశాంక్, ఏ 8 గా దూలం శ్రీకాంత్, ఏ 9 గా పెరుమాండ్ల శార్మిక్, ఏ 10 గా పోతబోయిన వసంత్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారనీ, అందుకే ముందస్తు చర్యగా అరెస్టు చేసినట్లు వరంగల్లు సీపీ రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారనీ, బీజేపీలో చాలా మందికి పేపర్ షేర్ చేశారని సీపీ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడారని, పేపర్ లీక్ కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్ స్కూల్ నుండి పేపర్ బయటకు వచ్చిందని చెప్పారు.
పేపర్ లీక్ కేసులో మరి కొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ అరెస్టు పై లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చామని సీపీ వెల్లడించారు. విచారణలో ఏ 2 ప్రశాంత్ కూడా నేరాన్ని అంగీకరించారని, సంజయ్ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారని, బండి సంజయ్ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు గా నిర్ధారణ అయ్యిందని సీపీ స్పష్టం చేశారు.
BJP: బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత .. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్టు