ఇద్దరు దుండగులు బంగారం దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో కాల్పుల జరిపి సినీ పక్కీలో చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలాన్ని రేపింది. నాగోల్ స్నేహపూరి కాలనీలోని బంగారం దుకాణంలోకి ఇద్దరు దుండగులు చొరబడి షట్టర్ లు మూసివేసి లోపల ఉన్న వారిని తుపాకీతో కాల్పులు జరిపి బెదిరించారు. మూడు రౌండ్ లు కాల్పుల జరిపి బంగారు అభరణాలు, నగదు బాక్స్ తో ఉడాయించారు. వారు జరిపిన కాల్పుల్లో దుకాణం యజమాని కళ్యాణ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆధారాల కోసం పోలీసులు సీసీ టీపీ పుటేజీ పరిశీలించారు. ముగ్గురు దుండగులు పల్సర్ బైక్, యాక్టివా మీద వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు .. దుండగులు రాజస్థాన్, హర్యానా, యూపి గ్యాంగ్ సభ్యులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సినిమా పక్కీలో చోరీ జరగడం వ్యాపార వర్గాలను ఆందోళనకు గురి చేస్తొంది. విషయం తెలియడంతో స్థానిక ప్రజలు కాల్పులు జరిగిన గోల్డ్ షాపు వద్దకు భారీగా తరలిరావడంతో పోలీసుల దర్యాప్తునకు ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్న జనాలను పంపించి వేశారు.