Telangana: తెలంగాణలో ఇప్పుడు రాజకీయ సందడి తగ్గిపోయింది అనుకుంటున్నారా? కానీ అసలు ఉత్కంఠ ఇప్పుడే ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ గురించి కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతంతో ఏ పార్టీకి లాభం ? ఏ పార్టీకి నష్టం? అనే లెక్కలో రాజకీయ పార్టీల నేతలు బిజీ బిజీగా ఉన్నారు.
తెలంగాణలో ఇదే హాట్ చర్చ
మహబూబ్ నగర్ -హైదరాబాద్ -రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పాటు నల్గొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ మారుతున్న రాజకీయ సమీకరణాల సమయంలో అందరి దృష్టి ఈ ఎన్నికపై పడింది. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మహబూబ్ నగర్ -హైదరాబాద్ -రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 67.28 శాతం, నల్గొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 76.41 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో విజయం సులభం కాదేమోనని టాక్ వినిపిస్తోంది.
నేడే విడుదల
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు తమ ఖాతాలోకే అన్న ధీమాలో టీఆర్ఎస్ వర్గాలున్నాయి. భారీగా అర్హులైన గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్చడంలో సక్సెస్ అయ్యమని టీఆర్ఎస్ భావిస్తోంది . రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలలో భారీ ఆధిక్యంతో గెలుపు ఖాయం అనే విశ్వాసంతో బీజేపీ ఉంది. మరోవైపు ఇతర పార్టీల నేతలు సైతం ఇదే విశ్వాసంతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు విడుదల అయ్యే ఫలితాలు ఉత్కంఠకు తెర దించనున్నాయి.