మునుగోడు ఉప ఎన్నికల వేళ ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కు వేసిన స్కెచ్ ను టీఆర్ఎస్ సర్కార్ భగ్నం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి భారీ ఎత్తున నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టలతో పోలీసులకు దొరికిన వారిలో రామచంద్ర భారతి, సోమయాజుల స్వామి, నందకుమార్ లు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరంతా ఢిల్లీకి చెందిన వారని, బంజారాహిల్స్ డెక్కన్ ఫ్రైడ్ హోటల్ కు చెందిన నందకుమార్ (నందు) ఈ వ్యవహారానికి మధ్య వర్తిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నందు సన్నిహితుడనే ప్రచారం ఉంది.
మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి లను పార్టీ ఫిరాయింపునకు చర్చలు జరుపుతుండగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసులు దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దాదాపు వంద కోట్ల డీల్ కాగా స్పాట్ లో రూ.15 కోట్ల వరకూ పోలీసులకు పట్టుబడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రలోభపర్వానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో పామ్ హౌస్ పై రైడ్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు.
రామచంద్ర భారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందిందని సీపీ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే పదవులు, డబ్బులు, కాంట్రాక్ట్ లు ఇస్తామని ప్రలోభ పెట్టారని, నందు మద్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఇది కేసిఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని బాలరాజు అన్నారు.
ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారం బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా అయన పేర్కొన్నారు. అక్కడి స్వామీజీ ఎవరో కూడా తమకు సంభందం లేదని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ కూడా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే దేనని అన్నారు. ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీ కి లేదని బండి స్పష్టం చేశారు.