Munugodu Bypoll: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం మునుగోడు. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మరో మూడు వారాల్లో జరగబోతున్నది. మునుగోడు ఉప ఎన్నిక ఏ పరిస్థితిలో వచ్చింది అనేది అదంరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తూ నియోజకవర్గంలో తన ప్రభావం ఏమిటో చూపాలని ప్రయత్నం చేస్తుండగా, అధికార టీఆర్ఎస్ ఇక్కడ గెలుపు కోసం నానారకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తొంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మునుగోడులో ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చీల్చుకుంటాయి. ప్రభుత్వ అనుకూల ఓట్లు టీఆర్ఎస్ కు పడతాయి. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకూ అంత జోష్, స్పీడ్ లేదు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు చూసుకుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ఉండే పరిస్థితి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి పిల్లర్ లాంటి లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీ అభ్యర్ధిగా నిలవడంతో కాంగ్రెస్ పార్టీలోని కొంత బలం బీజేపీ కి మళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఓటింగ్ మూలంగా బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అంచనా వేయడం కాస్తకష్టం!.
Munugodu By Poll: కాంగ్రెస్ పార్టీతో ఐప్యాక్
తెలంగాణలో ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. అయితే మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీతో ఐప్యాక్ ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ప్రశాంత్ కిషోర్ సీఎం కేసిఆర్ తో కలిసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఐప్యాక్ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని అందరూ భావిస్తుంటారు. కానీ ఐప్యాక్ టీమ్ మాత్రం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తొంది. దాదాపు 15 మంది ఐప్యాక్ టీమ్ సభ్యులు మునుగోడు నియోజకవర్గంలో దిగారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత సీనియర్ లు ఆయనను వ్యతిరేకిస్తూ ఆయన నాయకత్వంపై ఒక్కరొక్కరు తిరుగుబాటు చేస్తున్నారు. కొందరు ఆయనను వ్యతిరేకిస్తూ పార్టీ నుండి వెళ్లిపోతుండగా, మరి కొందరు పార్టీలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఉనికికి, మనుగడకు ఈ మునుగోడు ఉప ఎన్నిక ఒక పరీక్ష గా మారింది. అందుకే పాల్వాయి స్రవంతి రెడ్డిని అభ్యర్ధి ఎంపిక చేయడంలో ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యింది. ఆమె తండ్రి దివంగత పాల్వాయి గోవర్థన్ రెడ్డి అయిదారు సార్లు ఎమ్మెల్యే, పార్లమెంట్ గా సభ్యుడుగా చేసి ఉండటం, స్రవంతి రెడ్డి కూడా గతంలో పోటీ చేసి 20వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న కారణంగా వ్యక్తిగతంగా ఆమెకు ఉన్న బలాన్ని గుర్తించి అభ్యర్ధిగా నిలబెట్టారు.
బీజేపీ విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్ధిగా ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణలో తెలియని వారు ఎవరూ లేరు. టీఆర్ఎస్ కూడా మాజీ ఎమ్మెల్యేని పోటీకి నిలిపింది. ఇలా మూడు పార్టీలకు బలమైన అభ్యర్దులు ఉన్నారు. మూడు పార్టీల్లో ఎవరి బలం వారికి ఉంది. ఎవరి స్ట్రాటజీ వాళ్లకు ఉంది. అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే పూర్తిగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్, కేసిఆర్, కేటిఆర్ వ్యూహాలు, పార్టీ సొంత బలం మీద ఆధారపడి ఉండగా, బీజేపీ కేంద్రంలో వాళ్లకు ఉన్న బలం, ఆర్ధిక శక్తులు, అలానే కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యక్తిగత చరిష్మా మీద ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఇమేజ్ తో పాటు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలంతో పాటు ఐప్యాక్ స్ట్రాటజీని నమ్ముకుంది. ఐప్యాక్ కు దేశ వ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అందరికీ తెలుసు. ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత ఐప్యాక్ స్ట్రాటజీ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఎన్నిక మునుగోడు నియోజకవర్గమే. ఐప్యాక్ సంస్థ పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని పని చేస్తొంది. ఏపిలో వైసీపీకి ఐప్యాక్ పని చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ పని చేస్తుంది. ఇక్కడ మునుగోడులో కూడా ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ పని చేస్తొంది. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపుతుంది..? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బలం చేకూరుస్తుందా..? లేదా అనేది తెలియాలంటే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే వరకూ ఆగాల్సిందే.
Allagadda Bhuma Family: భూమా ఫ్యామిలీ గొడవ..! ఇరుక్కున్న అఖిలప్రియ, సీటు కోసం టీడీపీ ..