మునుగోడు ఉప ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలిమెల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తొంది. బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయం లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ప్రచార వాహనంపై ఇతర కార్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. టీఆర్ఎస్ నేతలే తమ పైకి వచ్చి రెచ్చగొట్టడమే కాక దాడులు చేశారని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని అన్నారు. పోలీసులు చూసి చూడనట్లు ఉంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో టీఆర్ఎస్ ఈ దుశ్చర్యలకు పాల్పడిందని ఈటల మండిపడ్డారు. రాళ్ల దాడిలో తన గన్ మెన్, పీఏ గాయపడ్డారనీ, పది నుండి 15 కార్లను ధ్వంసం చేశారని అన్నారు. మరో పక్క టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ వాళ్ల రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు దాడులు చేశారని ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రచార రథంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాడుల ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను పెంచాలనీ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ టీఆర్ఎస్ గూండాయిజం
మునుగోడులో గెలవలేమని అర్థమై, బిజెపి ప్రచార వాహనాలపై దాడులకు తెగబడిన గులాబీ గూండాలు pic.twitter.com/CmHJYynRuF
— BJP Telangana (@BJP4Telangana) November 1, 2022