TRS BJP: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎంపి ధర్మపురి శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రి కేసిఅర్, మంత్రి కేటిఆర్, టీఆర్ఎస్ లక్ష్యంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని దోషిగా చిత్రీకరించి రైతుల్లో మైలేజ్ పొందాలని అధికార టీఆర్ఎస్ చూస్తుంటే, రైతులకు అన్యాయం చేస్తుంది టీఆర్ఎస్యే అని అటు కేంద్రం, ఇటు బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది.
TRS BJP: నిన్న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
తాజాగా కేంద్రంలోని వ్యతిరేకంగా అధికార టీఆర్ఎస్ ఆందోళన చేస్తుండగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఆందోళనలు చేస్తోంది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిరసన కార్యక్రమాలను నిర్వహించగా, నేడు బీజేపీ కరెంటు చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీనే కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వీళ్లకు పోలీసుల నుండి ప్రతిఘటనలు ఎక్కడా కనబడలేదు.
TRS BJP: నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు
అయితే నేడు విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతల నిరసనలను ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ గా ఆందోళనలు దిగుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ప్రజానీకంలోనూ చర్చనీయాంశం అవుతోంది.