TRS MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియా ముందుకు వచ్చి బీజేపీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై ఆరోపణలు చేశారు. రీసెంట్ గా ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడిని విచారణ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసులో నిందితుడైన నందకుమార్ ను విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు కోర్టు నుండి అనుమతి పొందారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడిందని అన్నారు రోహిత్ రెడ్డి, ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టాలని చూశారనీ, ఆ క్రమంలోనే ఈడీ ద్వారా తనకు నోటీసులు ఇప్పించి విచారణ జరిపారని తెలిపారు.
మొదటి రోజు ఆరు గంటల పాటు విచారించినా .. ఏ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో కూడా ఈడీ అధికారులు చెప్పలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి రెండో రోజు అడిగారని చెప్పారు. తన తమ్ముడిని కూడా పొంతనలేని ప్రశ్నలతో వేధించారని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, విచారణలు చేసినా లొంగేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ఎక్కడా మనీలాండరింగ్ జరగలేదని కేవలం తనను లొంగదీసుకునేందుకే ఈడీ విచారణ జరిపిందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ తీరుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ ఎందుకు జోక్యం చేసుకుంది అనే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. బీఎల్ సంతోష్, తుఫార్ లు సుద్దపూసలైతే విచారణకు ఎందుకు హజరు కావడం లేదని ప్రశ్నించారు రోహిత్ రెడ్డి. ఈడీ కుట్రను బయట పెట్టేందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరించినా తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. తన తమ్ముడిని పొంతన లేని ప్రశ్నలతో వేధించారని చెప్పారు. కేసులో ఫిర్యాదుదారుడిని పిలిచి విచారించడం విడ్డూరంగా ఉందని అన్నారు. వారు అనుకున్నది జరగలేదని రూట్ మార్చి నందకుమార్ ను విచారణ చేస్తామని ఈడీ పిటిషన్ వేసిందన్నారు. ఎలాగైనా తనను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆ క్రమంలోనే నందకుమార్ ద్వారా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రోహిత్ రెడ్డి. నందకుమార్ తో వారు అనుకున్నట్లుగా స్టేట్ మెంట్ ఇప్పించాలని అనుకుంటున్నారని తెలిపారు.