తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈడీ, ఐటీ, సిట్ విచారణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తొందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, బీజేపీ కీలక నేతల లక్ష్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో మంత్రి మల్లారెడ్డి అన్నారు. చర్యకు ప్రతి చర్య కూడా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంటే కేంద్రంలోని బీజేపీ వారి ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తే వాళ్లపై తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తామని పరోక్షంగా పేర్కొన్నారు.
ఐటీ అధికారులు తన కుమారుడిని ఇబ్బందులకు, మానసిక వేదనకు గురి చేశారనీ, వారి ఇబ్బందుల వల్లనే తమ కుమారుడు ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఐటీ, సీఆర్పీఎఫ్ పై ఆరోపణలు చేసిన మంత్రి మల్లారెడ్డి .. వారిపై ఫిర్యాదు చేస్తామని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హజరైన కవిత మాట్లాడుతూ .. ఈడీ, ఐటీకి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని అన్నారు. బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు పిలిస్తే తాము మాత్రం హజరు కావాలి కానీ బీజేపీ వాళ్లు విచారణకు రారా అని ప్రశ్నించారు.
బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నించారు. మన దగ్గర కేసులో దొరికితే విచారణ చేయకూడదా అని ప్రశ్నించారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. బీఎల్ సంతోష్ ను విచారణ కు రమ్మంటే కోర్టుకు వెళ్లారనీ, సుప్రీం కోర్టు చెప్పినా విచారణకు రావడం లేదని పేర్కొన్నారు. నిన్న సభ పెట్టి బండి సంజయ్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో అర్ధం కాలేదన్నారు. తప్పు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు. టీ బీజేపీకి నాయకులు లేరు, ఐడియాలజీ లేదని విమర్శించిన కవిత.. రామ్ నామ్ జప్నా ..పరాయి లీడర్ అప్నా పాలసీ అవలంబిస్తొందని అన్నారు. బీజేపీకి సొంత నాయకులు ఎవరూ లేరనీ, అందుకే ఈడీ, ఐటీ, సీబీఐ ద్వారా ఇతర పార్టీ నేతలను దొంగిలిస్తున్నారని ఘాటుగా విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?