CBI Trap Case : ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపి నివాసంలో సీబీఐ అధికారులు దాడి చేసి ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఎంపి వ్యక్తిగత సహాయకులుగా చెప్పుకుంటున్న వీరు ఓ భవన యజమాని నుండి రూ.5లక్షలు లంచం డిమాండ్ చేసి లక్ష రూపాయలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటనపై టీఆర్ఎస్ తెలంగాణ ఎంపి మాలోతు కవిత స్పందించారు. తనకు ఢిల్లీలో వ్యక్తిగత సహాయకులు ఎవరూ లేరని తెలిపారు. సీబీఐ అధికారులకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల్లో దుర్గేష్ కుమార్ అనే వ్యక్తి తన డ్రైవర్ అని తెలిపారు. మిగిలిన ఇద్దరు ఎవరో తనకు తెలియదని చెప్పారు.
ఢిల్లీలో సున్మిత్ సింగ్ లంబా అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా ఎంపి పిఎలమని చెప్పుకున్న అజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్ లు ఆ భవన నిర్మాణ దారుడిని బెదిరించారు. ఆ ఇంటి నిర్మాణం అక్రమమని, రూ.5లక్షలు ఇవ్వాలని లేకుంటే అధికారులకు ఫిర్యాదు చేసి కూల్చివేయిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఎంపి గృహంలో సదరు భవన యజమాని రూ.లక్ష నగదు ఇస్తుండగా సీబీఐ అధికారులు ముగ్గురు వ్యక్తులను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. దీనిపై వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విషయంపై తనకు ఎటువంటి సంబంధం లేదని ఎంపి పేర్కొంటున్నారు. వారు ఎవరో కూడా తనకు తెలియదని అంటున్నారు