TRS MP KK: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉందరు అనేది అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో తీవ్ర స్థాయి విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష సభ్యులు బయటకు వచ్చిన తరువాత పలకరించుకోవడం, మాట్లాడుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కో సారి తమ పార్టీ నాయకులు ప్రత్యర్ధులతో మాట్లాడితే అది కూడా తమ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారితో సన్నిహితంగా ఉంటే సదరు పార్టీలో అనేక అనుమానాలు, ఊహాగానాలు సాగుతుంటాయి. అదే హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అవుతుంది. అటువంటి ఘటనే ఆదివారం తెలంగాణలో ఒకటి జరిగింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణతో మంత్రివర్గం నుండి కేసిఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సత్తా ఏమిటో సీఎం కేసిఆర్ కు చూపారు. ఇప్పటికీ ఈటలను భూకబ్జా ఆరోపణలో దోషిగా తేల్చే పనిలో టీఆర్ఎస్ సర్కార్ ఉంది. ఆ క్రమంలోనే అధికారులు ఇటీవల ఈటలకు చెందిన భూముల్లో సర్వే చేయడంతో పాటు అసైన్డ్ భూముల ఆక్రమించింది వాస్తవమేనని కలెక్టరే స్వయంగా మీడియాకు వెల్లడించారు.
TRS MP KK: ఈటలను ఆలింగనం చేసుకున్న టీఆర్ఎస్ నేత కేకే
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే కేశవరావు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం నేడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారిడి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు హజరైయ్యారు. సహజంగానే వేరు వేరు పార్టీల నాయకులు అయినా పరస్పరం పలకరించుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే వివాహ వేడుకకు హజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పలకరించడంతో పాటు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. పలువురు ఈటలను కేకే ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లో క్లిక్ మనిపించారు. ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయంగా పలు కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యాదృశ్చికంగా జరిగిన ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఏ విధంగా స్పందిస్తారు అంటూ చర్చించుకుంటున్నారు.