Munugode Bypoll: హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) పై దాదాపు 10 వేలకుపైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. మరో పక్క ఈ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు తమ మార్కు చూపించారు. ప్రధానంగా కారు గుర్తు పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతీ గుర్తులకు భారీగానే ఓట్లు పడ్డాయి.
టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డికి 97,006 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి కేవలం 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన సమయంలో పాల్వాయి స్రవంతికి 27వేలకు పైగా ఓట్లు రాగా, ఈ సారి నాలుగు వేల ఓట్ల వరకూ తగ్గాయి. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డిపై 37వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈ సారి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్రత్యర్ధిపైనే 10వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. నాడు రాజగోపాల్ రెడ్డికి 99,239 ఓట్లు రాగా, ఈ సారి 86,697 ఓట్లు వచ్చాయి. ప్రభాకరరెడ్డికి నాడు 61,687 ఓట్లు రాగా, ఈ సారి 97,006 ఓటలు వచ్చాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తం 15 రౌండ్ లలో కేవలం 2,3,15 రౌండ్ లలో మాత్రమే బీజేపీ అధిక్యత కనబర్చింది. ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. అధికార టీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొంటూనే అధికార టీఆర్ఎస్ మద్యం, మనీ పంపిణీ చేసి అధర్మంగా గెలిచిందని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆయన ఆరోపించారు.