టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంగళవారం (15వ తేదీ) శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. వీటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో జరిగే సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై లోతైన విశ్లేషణ జరగనున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సిద్దం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఅర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ యంత్రాంగం ఏ విధంగా పని చేయాలని, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో రీసెంట్ గా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక తీరు, ఓటింగ్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తొంది. రాబోయే రోజుల్లో బీజేపీ తీరును ఎలా ఎండగట్టాలి. కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి ఎలా ఉండాలి, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం. జాతీయ స్థాయిలో పోరాటాల వ్యూహం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రాజకీయంగా చేయాల్సిన ఉద్యమాలు ఇలా పలు కీలక అంశాలపై చర్చించి నేతలకు కేసిఆర్ దిశానిర్దేశం చేస్తారని సమాాచారం.