TS Govt: ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 2లక్షల 30 వేల మంది ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. పరీక్షలు రాసిన వారిలో దాదాపు 51 శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఈ ఫలితాలపై పెద్ద దుమారమే లేచింది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు నడవలేదు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఫెయిల్ అవ్వడంతో ప్రభుత్వం వీరిని పాస్ చేయాలని విద్యార్ధి సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్ధులను పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
TS Govt: ఫెయిలైన విద్యార్ధులందరికీ పాస్ మార్కులు
శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిలయిన విద్యార్ధులందరికీ కనీస శాతం (35 శాతం) మార్కులతో పాస్ చేస్తున్నట్లు తెలిపారు. అందరినీ పాస్ చేయడం ఇదే మొదటి సారి అని చెప్పిన మంత్రి.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని స్పష్టం చేశారు. కరోనా కారణంగా విద్యావ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొందని అన్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా మూడవ తరగతి నుండి పీజీ వరకూ ఆన్ లైన్ క్లాస్ లను నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే ఇంటర్ ఫస్ ఇయర్ పరీక్షలు నిర్వహించామన్నారు. అన్ని అంశాలను ఆలోచించిన తరువాతనే పరీక్షలు నిర్వహించామన్నారు. అయితే 51 శాతం మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారన్నారు. అయితే ఫెయిల్ అయిన వారిలో ఎక్కువ శాతం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్ధులే ఉన్నారని చెప్పారు. ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎం కేసిఆర్ ను లక్ష్యంగా చేయడం సరికాదనీ, ప్రతిదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని విమర్శించారు.
ఫలితాలపై ఇంటర్ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదని వివరణ ఇచ్చారు. వాల్యుయేషన్ పకడ్బందీగా నిర్వహించామన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదని అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక సెకండ్ ఇయర్ లో విద్యార్ధులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఇలానే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా ప్రభుత్వం పాస్ చేస్తుందని ఆశించడం మంచి పద్ధతి కాదని మంత్రి అన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.