రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది. ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

పిటిషన్ పై వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఉన్నందున రాజ్ భవన్ లోనే వేడుకలు జరుపుకోవాలని ఈ నెల 13వ తేదీనే రాజ్ భవన్ కు ప్రభుత్వం లేఖ రాసినట్లు కోర్టుకు తెలిపారు. రాజ్ భవన్ లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హజరు అవుతారని ఏజి తెలిపారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్ కాస్టింగ్ చేస్తామని చెప్పారు. ఏజి వాదనలు విన్న న్యాయస్థానం.. రిపబ్లిక్ డే నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఈ నెల 19న ఇచ్చిన మార్గదర్సకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది.
ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే కోవిడ్ ఆంక్షలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించింది. కావున ప్రభుత్వం చెబుతున్న సాకులను తాము పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండుగ అని, దేశ భక్తిని చాటిచెప్పే పండుగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్పూర్తి ని దాటేలా ఘనంగా వేడుకలు జరపాలని ఆదేశించిన ధర్మాసనం .. పరేడ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని తెలిపింది.