TS High Court: తెలంగాణ హైకోర్టులో పది మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయమూర్తుల కేటగిరి నుండి ఎడుగురు, న్యాయాధికారుల కేటగిరి నుండి ఆయిదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా వీరిలో పది మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
న్యాయవాదుల విభాగం నుండి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, శ్రావణ్ కుమర్ వెంకట్, న్యాయాధికారుల విభాగం నుండి అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో 19 మంది మాత్రమే ఇప్పటి వరకూ సేవలు అందిస్తున్నారు. తాజాగా నియమితులైన పది మందితో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది. తెలంగాణ హైకోర్టులో ఒకే సారి పది మంది న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలి సారి. మొదటి కోర్టు హాలులో నూతనంగా నియమితులైన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.