KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం ప్రారంభం నుండే జీఎస్టీ భారం పడనుంది. వస్తు సేవల పన్ను (టీఎస్టీ) చెల్లింపులపై విధానపరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దుస్తులు, పాదరక్షలు, రెడిమెడ్ వస్త్రాలు వంటి వస్తువులు రేపటి నుండి ( ఫస్ట్ జనవరి 2022) ఖరీదైనవిగా మారతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వస్తువులపై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతం పెంచింది.
KTR: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ
ఈ నేపథ్యంలో ఈ వస్తువులపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ మంత్రి కేటి రామరావు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ రోజు (డిసెంబర్ 31) జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలని ఆయన కోరారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కూదేలు అవుతుందని పేర్కొన్న కేటిఆర్.. కోట్లాది మంది చేనేత జీవితాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్నారు. జీఎస్టీ పెంపు చేస్తే రైతుల మాదిరిగానే నేతన్నలు కూడా కేంద్రం పై తిరగబడతారని కేటిఆర్ హెచ్చరించారు.
46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
మరో పక్క ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు సమావేశానికి హజరైయ్యారు. ఏపి నుండి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలంగాణ నుండి ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు.