Video Viral: కరోనా నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా రోడ్డుపైకి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు ఏదో ఒక కారణం చెప్పి రోడ్డుపై వాహనాలతో తిరుగాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు లోని మంగళఘాట్ పరిధిలో పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో వెళుతున్న వ్యక్తిని పోలీసులు ఆపారు. అతను తాను ఏసీబీ అధికారినంటూ కానిస్టేబుళ్లకు చెప్పడంతో వారు వెనక్కు తగ్గారు. ఖరీదైన కారులో టిప్ టాప్ గా ఉన్నాడు నిజంగా అధికారియేమో అని కానిస్టేబుళ్లు ఏమి మాట్లాడలేకపోయారు.
Read More: Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం వివాదంపై పండితుల మధ్య పంచాయతీ..!!
అయితే అక్కడ ఉన్న పై అధికారికి ఎందుకో అనుమానం వచ్చి ఐడి కార్డు చూపమని అడిగారు. అతను కార్డు చూపగా అది నకిలీది అని గుర్తించిన సదరు పోలీసు అధికారి అతని పర్సు లాక్కొని చూడగా వివిధ రకాల నకిలీ ఐడి కార్డులు ఉన్నాయి. దీంతో ఇతను పెద్ద మోసగాడుగా భావించిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతని పై కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డుపై వెళ్లి ఆ ప్రబుద్ధుడు దొరికిపోయాడు. చివరకు అతను పోలీసుల కాళ్ల వేళ్లా పడినా అతన్ని వదలకుండా కారును సీజ్ చేసి ఠానాకు తరలించారు పోలీసులు.
పోలీసు అధికారులకే తాను ఏసీబీ అధికారినంటూ ఇలా మోసానికి పాల్పడ్డాడు అంటే అతను ఈ నకిలీ కార్డులతో ఇంకా ఎంత మందిని మోసం చేసి ఉంటాడో అని పోలీసులు అతని గురించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుద్దుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.