Vijayashanthi: ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ పథకాన్ని పైలైట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పథకం ఉద్దేశం, విధి విధానాలు అధ్బుతంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నుండి ప్రారంభిస్తుండటంపై వివిధ రాజకీయ పక్షాల నుండి సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపి, బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసిఆర్ పై తన దైన శైలిలో సెటైర్ లు వేశారు. సీఎం కేసిఆర్ సారుకు హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చిందని వ్యాఖ్యానించారు. దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక లోగుట్ట్టు ఏమిటో ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదని అన్నారు విజయశాంతి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల పైచికులు దళిత కుటుంబాల కోసం రూ.2 వేల కోట్ల మేర ఖర్చు చేస్తామనీ ప్రకటించారనీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయాలంటే సుమారు 2 లక్షల కోట్లు అవసరమవుతాయనీ, అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా అని విజయశాంతి ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ లెక్క ప్రకారం ఇదంతా కార్యరూపం దాల్చాడానికి 165 సంవత్సరాలు పడుతుందని అన్నారు. ఇదంతా చూస్తుంటే దళిత సిఎం, దళితులకు మూడు ఎకరాల భూమి అంటూ కేసిఆర్ గారు మరచిన హామీలు, దళిత ఉప ముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద లాగానే ఈ దలిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యే వ్యవహారం అనిపిస్తుందని విమర్శించారు. ఒక వేళ ఉప ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు కోర్టుకు వెళ్లి ఆపితే దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలపై నింద మోపి దాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే హుజూరాబాద్ మాత్రమే అన్నట్లుగా కేసిఆర్ సర్కార్ పోకడ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.